అనన్య న్యూస్, నాగర్ కర్నూల్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ పనుల్లో ఎప్పటి కప్పుడు పురోగతితో పాటు ఉపాధి కూలీల సంఖ్యను పెంచి 100 రోజుల పని కల్పించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఎంపీడీవోలను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్, నర్సరీల నిర్వహణ, హరితహారం ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీల సబ్సిడీ రుణాలపై ఎంపీడీవో లు, ఎంపీవో లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో కూలీల హాజరుశాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, బయోమెట్రిక్ హాజరు తీసుకోవాలని, తక్కువ పనితీరు కనబరుస్తున్న గ్రామాలు, మండ లాలపై దృష్టి సారించాలని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో 1,88,012 ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయని, అందులో 83064 కుటుంబాలకు చెందిన 1,83,077 మందికి ఉపాధి హామీ పనులు కల్పించవచ్చని,1,09,343 మంది ఉపాధి హామీ పనులకు వస్తున్నారని కలెక్టర్ వివరించారు. రానున్న మూడు నెలల్లో రోజువారిగా 20శాతం కూలీల సంఖ్యను పెంచుతూ ఉపాధి హామీ పనులను కల్పించాలని మండల అభివృద్ధి అధికారాలను ఆదేశించారు.
స్వచ్ఛభారత్ ద్వారా ఇప్పటివరకు 79,326 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించడం జరిగిందని కొత్తగా ఇంకా ఎవరికైనా వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోతే 1776 వ్యక్తిగత మరుగుదొడ్లను మంజూరు చేయడం జరిగిందని, అందుకు లబ్ధిదారుల ఆధార్ కార్డు వివరాలను అందజేయాలని ఆదేశించారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సబ్సిడీ రుణాల లబ్ధిదారుల వివరాలను ఎంపీడీవోలు తక్షణమే ఎంపిక చేసి జిల్లాకు చేరవేయాలని ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పందిరి వ్యవసాయం కోసం నమోదు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక చేసి జాబితాను జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కు అందజేయాలన్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలకు నమోదు చేసుకున్న లబ్ధిదారులను ఒకటి నిష్పత్తి మూడు ప్రకారం ఎంపిక చేసి మైనార్టీ సంక్షేమ శాఖ అందజేయాలన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ ద్వారా సబ్సిడీ రుణాలకై నమోదు చేసుకొని ఎంపీడీవో పరిధిలో పెండింగ్ లో ఉన్న లబ్ధిదారుల జాబితాను వెంటనే ఆమోదించి అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, డీఆర్డీవో నర్సింగ్ రావు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామ్ లాల్, అడిషనల్ డీఆర్డీవో రాజేశ్వరి, లీడ్ బ్యాంకు మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే, డిప్యూటీ సీఈఓ భాగ్యలక్ష్మి, డి ఆర్ డి ఓ ఏ ఓ నటరాజ్, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.