అనన్య న్యూస్, భద్రాద్రి కొత్తగూడెంలో ఓ బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు మూడు పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉండగా అందులో 43 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఆదివారం ఉదయం భద్రాచలం డిపో నుంచి ఓ ఆర్టీసీ బస్సు మెుత్తం 47 మంది ప్రయాణికులతో విజయవాడకు బయల్దేరింది.
కొత్తగూడెం జిల్లా చంచుపల్లి మండలం ఆనందగనికి వద్దకు రాగానే ఓ బొగ్గు లారీ ఆర్టీసీ బస్సును అతివేగంగా ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సు మూడు పల్టీలు కొట్టి రహదారిపై బోల్తాపడింది. మెుత్తం ప్రయాణికుల్లో 43 మంది గాయపడ్డారు. వారిలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. గాయాలు, చిన్న పిల్లల ఏడుపులతో ఆ ప్రాంతంలో బీభత్స పరిస్థితి నెలకొంది. సకాలంలో స్పందించిన స్థానికులు క్షతగాత్రులను కొత్తగూడెంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో విజయవాడ, నూజివీడు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు.