అనన్య న్యూస్, వరంగల్: ఇటీవల విడుదలై ఎంతో ప్రజాదరణ పొందుతున్న తెలంగాణ సినిమా బలగంలో కుటుంబ సభ్యుల ఆత్మీయతను చాటి చెప్పే చివరి ఎమోషనల్ పాట పాడి అందరి హృదయాలు గెలుచుకున్న నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగ జంగాల కళాకారులు పస్తం మొగిలయ్యకు బుధవారం దళిత బంధు పథకాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంజూరు చేశారు.
తమ కల ద్వారా ఎంతో ప్రతిభను కనబరిచిన మొగిలయ్య దంపతులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని వారి యోగక్షేమాల గూర్చి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే మొగిలయ్య ప్రతిభను అభినందిస్తూ సన్మానించారు. మొగిలయ్య కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని వివరించగా వెంటనే స్పందించి నిమ్స్ హాస్పటల్ లో చేర్పించి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక కృషి చేశారు.
తన గాత్రంతో లక్షల మందిని కదిలించిన మొగిలయ్య దంపతులు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కుటుంబానికి చేయూత నందించాలని నిర్ణయించిన ఎమ్మెల్యే. ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే వారికి దళిత బంధు పథకాన్ని మంజూరు చేయించారు. అనారోగ్యంతో బాధపడుతున్న మొగిలయ్యకు చికిత్స చేయించడంతోపాటు దళిత బంధును కూడా మంజూరు చేయించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా బలగం మొగిలయ్య దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.