అనన్య న్యూస్, జడ్చర్ల: తెలంగాణ ఏర్పడక ముందు కరెంటు వస్తే దినపత్రికల్లో వార్త వచ్చేదని, తెలంగాణ వచ్చాక ప్రస్తుతం కరెంటు పోతే వార్త అవుతుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్ విజయోత్సవాల పేరిట జడ్చర్ల చంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గతంలో కరెంటు సరిగ్గా లేక వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు చేతి వృత్తులతో పాటు అనేక రంగాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో నిరంతరంగా 24 గంటల విద్యుత్ అందుతుందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందుతుండడంతో రైతులకు కరెంటు తిప్పలు తప్పాయన్నారు. ఎండాకాలం వచ్చిందంటే ఉక్కపోతతో సామాన్య ప్రజలు అల్లాడిపోయిన రోజులను గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ విజన్, దూరదృష్టి వల్ల నేడు విద్యుత్ సమస్య లేకుండా చేశారన్నారు. దేశంలోనే రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. అంతకు ముందు విద్యుత్ విజయోత్సవం సందర్భంగా విద్యుత్ పొదుపు వాడుక గురించి ఉద్యోగులతో కలసి ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జడ్పీ సీఈవో జ్యోతి, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ దొరేపల్లి లక్ష్మి, పిఎసిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, నాయకులు రామ్మోహన్, రేణుక, విద్యుత్ శాఖ డిఈ కృష్ణమూర్తి, అధికారులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.