అనన్య న్యూస్, ఖమ్మం: అకాల వర్షాలు, వడగళ్లతో పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రైతులు, అనుచరులతో కలిసి పొంగులేటి శనివారం కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పొంగులేటి అనుచరులను అడ్డుకున్నారు. కలెక్టరేట్ గేట్లను మూసి వేశారు. అయితే పొంగులేటి అనుచరులు కొందరు గేట్లు తోసుకుని కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని, రైతుల గోస కేసీఆర్కు తగులుతుందని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 30 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడ రైతుకు కష్టమొచ్చినా తాను ఉంటానని, వారికి మద్దతుగా నిలుస్తానని అన్నారు.