- ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ గెలిచి హైదరాబాద్ కు రాక
అనన్య న్యూస్, శంషాబాద్: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ శాలువాలతో సత్కరించి, అభినందించారు. మార్చి 26వ తేదీన ఢిల్లీ వేదికగా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 50 కేజీల కేటగిరీలో వియత్నాం బాక్సర్ ఎన్గెయెన్ థి టామ్పై జరీన్ పూర్తి ఆధిపత్యం కొనసాగించి 5-0తో విజయం సాధించింది. చాంపియన్షిప్స్లో పసిడి పతకంతో పాటు సుమారు రూ.82 లక్షల నగదు బహుమతి కూడా నిఖత్ ఖాతాలో చేరింది. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో నిఖత్ జరీన్కు ఇది రెండో స్వర్ణ పతకం. 2022లో 52 కిలోల విభాగంలో నిఖత్ వరల్డ్ చాంపియన్గా నిలిచింది.
కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్ వేణుగోపాలాచారి, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు చాముండేశ్వరి నాథ్, రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఉన్నతాధికారులు ధనలక్ష్మి, సుజాత, చంద్రా రెడ్డి, డాక్టర్ హరికృష్ణ, సుధాకర్, వివిధ క్రీడా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.