- రామచంద్ర పిళ్లైతో కలిపి విచారిస్తున్న ఈడీ అధికారులు..
అనన్య న్యూస్, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోమవారం మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. గంటన్నరగా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. పిళ్లై, కవితను కలిపి విచారిస్తున్నారు ఈడీ అధికారులు. అరుణ్ రామచంద్రపిళ్లైని కవిత బినామీగా చెబుతున్నారు ఈడీ అధికారులు. ఇద్దరి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. సౌత్ గ్రూప్తో సంబంధాలపై ప్రశ్నలు కూడా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆప్కు ముట్టిన రూ.100 కోట్లపై ఆరా ఈడీ అధికారులు అడుగుతున్నట్లుగా సమాచారం. అయితే పిళ్లై కస్టడీ ఈ మధ్యాహ్నంతో ముగియనుంది. ఈలోపే కీలక సమాచారం సేకరించే యోచనలో ఈడీ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ముందుగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్దకు కవితతో పాటు ఆమె భర్త అనిల్, మంత్రి శ్రీనివాస్గౌడ్, న్యాయవాది సోమ భరత్ చేరుకున్నారు. అనంతరం కవిత ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు. ఎమ్మెల్సీ కవితతో పాటు బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు కూడా ఈడీ కార్యాలయం దాకా వెళ్లారు. ఇక కవిత ఈ నెల16వ తేదీన ఈడీ ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే తన ప్రతినిధి న్యాయవాది భరత్ను మాత్రమే ఈడీ ఆఫీస్కు పంపారు. తాను దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల 24న సుప్రీంకోర్టు విచారించనుందని. ఈ నేపథ్యంలో తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు వేచి చూడాలని ఈడీకి లేఖ పంపారు. కానీ ఈడీ మాత్రం ఆమెకు 20న హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం ఈడీ ముంగిట హాజరు అయ్యారు.